కాల,దురితాల నడుమ నలిగి,
ఈతి బాధలు పడుతు చెలగి,
తనవారికి తక్క, పరులమేలు తలవక
ఇహపరాల తలపు పొసగక
మాయ మాటున ఉబుసుపోక,
కాయమున హంస పైకెగరగ..
కట్టెతోబాటు కాటికేగి
తోబుట్టువులు సైతం
తోడరాని పయనం
రుధిర,దేహ బాంధవులైనా
చేష్టలుడిగి చూడగా
తను బతికిన గతమున
సలిపిన గమనమున
మరలిన పలుమలుపుల
కలిగిన తలపుల నెమరి
భ్రాంతి పెరిగి విలవిలలాడి
తనవారి చుట్టు తనకలాడి..
కర్మ వాసనలు మూటకట్టి
బొటనవేలంత జీవుడింక
మది నిలబడిన చింతనలబట్టి
ఆ తోలుతిత్తి నుండి
తోచిన బొఱ్ఱ నుండి
బయటపడు వైనముల
ఆరునాల్కల అగ్గిబ్రాహ్మడు
కట్టెను సమిధగ కాల్చేయ
పుర్రె పగుల్చూసి
మరుభూమి నుండి మరలి
నా అనుకున్న వారు తరలి
వెళ్ళిపోవుట చూసి
ఛిద్రమయ్యే జీవుడికై
రుద్రుడక్కడే నిలిచెను
జీవాత్మ గుండె పగలనీక
పరమాత్మ నిండుగ నవ్వెను.
