“ముసలిది ఇంకా ఎంత కాలం బ్రతుకుతాదో, చెయ్యలేక చస్తున్నా” అంటూ పక్క ఎక్కింది సుమిత్ర. ఏమమనకుండా మౌనంగా విన్నాడు పరమేశం. ఆ ముసలిదీ ఆయనకు నానమ్మ పేరు రాజమ్మ, గత ముప్పై ఐదు ఏళ్ళుగా మంచాన పట్టి ఉంది. మాట రాదు, ఎవ్వరిని గుర్తుపట్టదు, ఒంట్లో ఏ అవయవం కదల్దు.
ఒరిస్సాలో జయపూర్లో మెయిన్ రోడ్కు కుడి పక్క తెలుగు వారు, ఎడమ పక్క ఒరియా వారు ఎక్కువగా ఉంటారు. కుడిపక్క మెయిన్ మార్కెట్ దగ్గర మహారాణిపేటలో రాజమ్మ ఉంటుంది. వడ్డీవ్యాపారం ఆవిడా చేసినంత పద్దతిగా ఎవ్వరు ఉండరేమో. ప్రతీ పని లెక్క ప్రకారమే జరగాలి, వంట కూడా లెక్క ప్రకారమే, మనిషికి ఒక వంకాయ అంటే ఒక్కటే రెండోది కావాలి అని అడిగినా దొరకదు, గరిటెడు పప్పు మనిషికి అంటే గరిటెడే.
రాజమ్మ భర్త పేరు ఎవ్వరికీ తెలియదు, అందరు అతన్ని రాజమ్మ మొగుడనే పిలుస్తారు. వారికి ఐదుగురు పిల్లలు మొదట ముగ్గురు కొడుకులు తరువాత ఇద్దరు కూతుళ్లు. మొదటివాడు కోదండరామయ్య, రెండోవాడు జానకిరామయ్య, మూడోవాడు అచ్చుతరామయ్య, కూతుళ్లు కౌసల్య, జానకి.
ఊరిలో మెయిన్ మార్కెట్లో ఓ కొట్టులో తన దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకొని కట్టలేని ఓ ఆసామి దగ్గర తీసుకొని పెద్దవాడిచేత కిరానా వ్యాపారం పెట్టించింది రాజమ్మ. మిగతా ఇద్దరినీ వేరే రెండు కోట్లలో పనికి పెట్టి, పని నేర్చుకోమంది. కూతుళ్ళకు తన వడ్డీ వ్యాపారం మెళుకువలు నేర్పింది.చదువులేవి పెద్దగా అబ్బక పోయినా వ్యాపారం మాత్రం అందరికి నరనరాల్లో జీర్ణమైనట్టు చూసింది.
మొదటివాడికి రాజాం, రెండోవాడికి విజయనగరం, మూడోవాడికి గరివిడి, ఆడపిల్లలికి ఒరిస్సాలో నవరంగపూర్, మత్తిలి సంబంధాలు చేశారు. కూతుళ్లు అత్తవారింటికి వెళ్లిపోగా రెండోవాడు, మూడోవాడు ఇక్కడ ఉంటె పెద్దోడికి మళ్ళి ఎదురొస్తారు అని చెప్పి విజయనగరం, గరివిడి పక్కన చీపురుపల్లిలో వ్యాపారాలు పెట్టించింది రాజమ్మ.
పెద్దోడు రోజూ రాజమ్మకు లెక్కలు చెప్పాల్సిందే, మిగతా ఇద్దరు మొదట్లో నెలకొకసారి జయపూర్ ఇంటికి వచ్చి లెక్కలు అప్పచెప్పేవారు. ఇంకా వారు రాజమ్మ పెట్టిన పెట్టుబడి తిరిగిచ్చిన తరువాత నెమ్మదిగా ఏదో ఒక సాకుతో రాకపోకలు తగ్గించేశారు.
కోడలికి వండవలసిన పప్పు, ఉప్పు, నూనె అన్నీ కొలత ప్రకారం ఇచ్చి మిగతావి ఓ అల్మెరలో పెట్టి తాళం వేసి, తాళం తన దగ్గర పెట్టుకునేది. కోదండరామయ్య భార్య వరలక్ష్మికి అత్తగారి పద్ధతులు కొలతలు మొదట్లో కొంచం కష్టమనిపించినా నెమ్మదిగా సర్దుకు పోయింది.
ఓరోజు రాజమ్మకి ఒంట్లో నలతగా ఉంటె ఊరిలో డాక్టర్కి చూపిస్తే, వైజాగ్ తీసుకెళ్లి పరీక్షలు చేయించామన్నారు.
“డాక్టర్లు అలాగే అంటారు పర్లేదులేరా, అదే సర్దుకుపోతుంది” అన్నాది రాజమ్మ.
అది జరిగిన వారం రోజులకు పక్షవాతం వచ్చి కాలు చేతులు నోరు పడిపోయింది. అది మొదలు ఆవిడ మంచం దిగింది లేదు. ఇంట్లో అన్ని పనులు వారలక్ష్మే చూసుకొనేది. ఇంట్లో సాయానికి మనిషిని పెట్టుకున్న ఒప్పుకునేది కాదు రాజమ్మ. నోరు లేకపోయినా ఏదో ఒకటి అరుస్తూనే ఉండేది. నెమ్మదిగా ఆ అరుపులు కూడా నోటి నుండి రావడం ఆగిపోయింది.
కోదండరామయ్య, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురు.
“చచ్చి ఏ లోకన్నా ఉందో కానీ మా అత్తమ్మ బ్రతికున్నతకాలం ఈవిడకి సేవలు చేస్తూ పోయింది ఆ మహాతల్లి” అంటూ అత్తగారిని గుర్తుచేసుకుంది సుమిత్ర.
వరలక్ష్మిగారు కాలం చేసి ఇప్పటికీ ఆరేళ్ళు. అప్పటినుండి రాజమ్మ సేవ అంతా సుమిత్ర, పరమేశం పైనే పడింది. కోదండరామయ్య వయసు కూడా డబ్బై పైనే. ఆయనకి కొంత దిగులుగానే ఉంటుంది, తల్లికి తలకొరివి పెట్టకుండా వెళ్ళిపోతానేమో అని. సొంత ఊళ్ళో వ్యాపారం, తాతలనాటి ఇంట్లో ఉన్నందుకు తల్లిని చూసుకునే బాధ్యత మొత్తం పెద్దకొడుకు పైన పడింది. మిగతా ఇద్దరూ తల్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారే కానీ ఆవిడని మాత్రం ఒక్క వారం రోజులు కూడా తమ దగ్గర ఉంచుకోరు.
“పెద్ద కుటుంబం, అవసరానికి అందరూ సాయం ఉంటారు అని ఈ సంబంధం చేశారు మా నాన్నా. ఏం సాయం ఒక్కరు అక్కరకు రారు” అంది
“ఇరువరెండేళ్లు అయింది అది జరిగి, ఇంకా తవ్వుతావా ఆ విషయాన్ని. మనకీ ఓ కొడుకు, కూతురు ఉన్నారు, వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు” అన్నాడు పరమేశం కొంచం బాధగా.
“అదే కదా నా బాధ, పదేళ్ళైంది ఇంట్లోనుండి బయటకు వెళ్ళి. ఓ గృహప్రవేశానికి కానీ, పెళ్లికి కానీ, ఫంక్షన్ కానీ వెళ్ళి ఒక పూట మావాళ్ళతో గడిపింది లేదు. ఎప్పుడూ ఇల్లు ముసలిది, అదే గొడవ అదే తంతు” అంటూ వాపోయింది.
“మా అత్తమ్మ వెళ్తూ వెళ్తూ నా గుదిబండ నీకు తగిలిస్తున్నానే అని పాపం ఎంత బాధ పడ్డాదో.” వరలక్ష్మమ్మ కోడల్ని కన్నకూతురుకన్నా ఎక్కువగా చూసింది. కూతురు కన్నా ముందు కోడలికి పెట్టేది అందుకేనేమో అత్తగారు, అత్తయ్య బదులు అత్తమ్మా అంటాది సుమిత్ర.
“మన చేతిలో లేనిది మనం ఏం చేస్తాం చెప్పు, గట్టిగా అనకు నాన్న వింటే బాధపడతారు” అన్నాడు.
“ఇంకో విషయం రేపు నర్స్ రాదట. అదో ఎక్స్ట్రా డ్యూటీ మనకి. ఎన్ని అనుకున్న ఏమౌతుంది జంగపోడు నానమ్మకు ఇల్లు కట్టినట్టే, షరా మామూలే, పడుకోండి” అంటూ లైట్ ఆపేసింది.
వరలక్ష్మమ్మ అత్తగారు నడిచినంత కాలం కోడల్ని బాగానే సాధించుకు తిన్నాదని, నడవలేక పోయినా కూడా బాగానే సేవ చేయించుకుంది అనే వారు కోడలితో.
ఇంకా కొన్నాళ్ళు ఆ సేవ, తిట్లు కార్యక్రమం జరిగిన తరువాత, ఒక రోజు రాజమ్మ ఉలకలేదు పలకలేదు. డాక్టర్ వచ్చాడు పోయినట్టే అని తేల్చేశాడు. అందరికీ కబురులు వెళ్ళాయి, కొడుకులు కూతుళ్లు కోడళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్లతో ఇల్లు చాన్నాళ్లకి కళకళలాడింది. అది చావింటి కన్నా పెళ్ళింటి లా ఉంది. ఒక్క కొండదరామయ్యగారు కొంత బాధలో ఉన్నా తమ్ముళ్లు చెల్లెల్లు మాటలతో కొంత తేలిక పడ్డారు.
మొత్తానికి శవాన్ని శ్మశానం చేర్చారు. కట్టెలమీద కన్నా ఎలెక్ట్రిక్ ఐతే సులభం ఇంకా తొందరగా అయిపోతుంది అని అందరూ నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన బల్ల మీద పడుకోబెడుతుంటే ఏదో మూలుగులా వినిపించింది.
పరమేశం సుమిత్ర కళ్లలో తను ఉదయం చూసిన ప్రశాంత గుర్తుకు వచ్చి ఏం మాట్లాడలేదు
మిగతావారు కూడా మళ్ళీ సెలవులు పెట్టాల్సి వస్తుందేమో అని సైలెంట్గా ఉండిపోయారు.
దూరంగా కూర్చున్న కొండందరంమయ్యగారితో ఎవ్వరు ఏది అనలేదు. అది ఎవ్వరు మాట్లాడుకొని చర్చించని ఒప్పందంలా ఉండిపోయింది.
కొంత సేపటికి రాజమ్మ బూడిదతో బయటపడ్డారు.
