“తెలుగు(అనువాద) సాహిత్యం – విడువవలసిన మౌనాలు – జరుపవలసిన అన్వేషణలు” ప్రసంగంపై వ్యాసము – అభిప్రాయము

అంతర్జాల వేదికగా “హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి” వారు నిర్వహించిన సదస్సులో “తెలుగు(అనువాద) సాహిత్యం – విడువవలసిన మౌనాలు – జరుపవలసిన అన్వేషణలు” అనే శీర్షిక పైన శ్రీ హేలీ కళ్యాణ్ గారి ప్రసంగంపై చిన్న వ్యాసము. ఇటువంటి విషయంపై వినడము కొత్త అనుభవం. కవితలు, అలంకారాలు, భక్తి సాహిత్యం , కావ్యాలు వంటి ప్రక్రియలపై మక్కువ తో తెలుగు-నుడిలో భాగాలుగా కూడా దాదాపు అదే కోవకు చెందినవి కావడం పరిపాటి అయింది . కానీ సాహిత్యంలో మౌనాలు, అన్వేషణలు కొత్తగా అగుపించి కొంత క్షుణ్ణంగానే ఈ ప్రసంగాన్ని విని ఒక వ్యాసము తెలుగు నుడిలో ప్రకటించాలని అనిపించింది. ఈ ప్రయత్నం కొత్తది కాబట్టి లోటుపాట్లు ఉంటవి.

ప్రసంగంలో మాట్లాడిన విషయాలు :

శీర్షికలోని “మౌనం” మాటను నిర్వచిస్తూ – తెలిసినా వ్రాయకపోవడం/మాట్లాడకపోవడం గానూ – తెలుగులో విస్తృతంగా లేనివి అనువదించుకోవలసినదిగా “అన్వేషణ” గా నిర్వచించారు. ముందుగా మౌనం వహిస్తున్న విషయాలు చర్చిస్తూ , ప్రస్తుతం చదువుతున్న లేక విరివిగా (Popular)గా లభ్యమవుతున్న పుస్తకాలు/ రచనలు Word cloud లో చూపెట్టారు.

యండమూరి- అయాన్ రాండ్ – ఖలీల్ గిబ్రాన్ – కాఫ్కా – జర్మన్ జానపద కథలు – విశ్వనాథ – వెండి డోనిగర్ – రోమీల – ముళ్ళపూడి – క్రైస్తవ సాహిత్యం – వసు చరిత్ర – మనుచరిత్ర – షేక్స్పియర్

ఇలా ఎంతో వైవిధ్యత తెలుగులో ఉంది. ఎవరికి నచ్చినవి వారు చదవాలి, వ్రాయాలి . కానీ ఒక జాతి సాంస్కృతిక విషయాలకు సంబంధించిన పుస్తకాల గురించి, భారతీయతపై ఆసక్తి/ ఉత్సాహం ఉన్న చదువరులకు/ రచయితలకు ఉన్న అవకాశాల గురించి కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అలా ప్రస్తావించిన పుస్తకాలు

“అరుణాచలంలో చలం” – సాంప్రదాయానికి దీటుగా వ్రాసిన వ్యక్తి తన జీవిత చివరిదశ లో భగవాన్ స్మృతులతో గడిపిన వ్యక్తి గా మిగిలి పోక, ఆ దశ ప్రస్తావన చాలా అరుదుగా ఉండడం సాహిత్యంలో మౌనంగా చక్కని ఉదాహరణలతో వివరించారు.

“కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి” గారి రచనలు – హిందూమతంపై నిరసనలను, వ్యాసాలను, తిప్పికొడుతూ సహేతుకంగా చేసిన సాహిత్య సృజన , వీరేశలింగం పంతులు గారికీ కాశీభట్ట వారికీ జరిగిన కలహము , పాఠశాల స్థాయి నుంచీ ప్రజలకు అందించకపోవడం, సాహిత్య లోకం విస్మరించిన తీరు కూడా ఒక మౌనంగా ఉదహరించారు శ్రీ హేలీ కళ్యాణ్ గారు.

ఇక కొన్ని అన్వేషించ అవసరం ఉన్న సందర్భాలూ, పుస్తకాలకు ఉదాహరణలు చూపెడుతూ –

“ఆర్య సామాజికులకు సాంప్రదాయవాదులకు జరిగిన చర్చలు” – ఒకే వేదికపై వారికి జరిగిన వాగ్వివాదాలను తెలుగు సాహిత్యంలో అందకపోవడం పైన అన్వేషణ జరగవలసిన అవసరం ఉంది. ఈ కోవలో హిందీలోని ” పురాణ దిగ్దర్శన్” , “క్యోఁ” వంటివి ఉటంకిస్తూ, శ్రీ చిర్రావూరి శివ రామకృష్ణ శర్మ గారూ ఉప్పల రాధాకృష్ణ గార్ల “నాలుగు శాస్త్రాల చర్చ” ప్రస్తుతం లభిస్తున్న పుస్తకం అనీ, అటువంటి పుస్తకాలు ధ్యేయంగా తెలుగు సాహిత్యంలో కూడా పుస్తకాలు రావాలి అని కోరుకున్నారు. – కరపాత్ర స్వామి వారి “రామాయణం మీమాంస”, “హిందూ కోడ్ బిల్ “, “భక్తి సుధా”,”భాగవతసుధా”, “రాధా సుధా” వంటి పుస్తకాలు ఉదహరిస్తూ, సాంప్రదాయవాదాన్ని సమర్ధించడానికి గానీ ,విమర్శించడానికి గానీ కావాల్సిన పాండిత్య అవసరాన్ని తెలిపారు. ఒక వాదాన్ని అంగీకరించినా, అంగీకరించకపోయినా ఉభయపక్షములూ తెలుసుకొని వాదప్రతివాదాల విధానాన్నీ అవసరాన్నీ తెలియజేశారు ఈ ప్రసంగంలో .

– చెరువులు ,నీటి సంరక్షణ సంబంధించిన “ఆజ్ భీ ఖరే హే తలాబ్ “అనే పుస్తకం నీటికీ సంస్కృతికి గల సంబంధం తెలుసుకోగలిగే అవకాశం ఉన్న పుస్తకంగా తెలుపుతూ , దాదాపు ఎనిమిది భాషలలో ఉన్న ఈ పుస్తకం తెలుగులో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అంటూ, ఇటువంటివి తెలుగులో కూడా ఉండడం ఒక అవసరమని తెలిపారు. ఒక జాతి సాంస్కృతిక విలువలను సమర్ధిస్తూ అందుకు దోహదపడే ఆంగ్ల సాహిత్యంలోని క్రింది పుస్తకాలు ప్రస్తావించారు. వెండెల్ బెర్రీ వారి ” వరల్డ్ ఎండింగ్ ఫైర్ ” , “అన్సెట్లింగ్ ఆఫ్ అమెరికా” పుస్తకాలు , రోజర్ స్క్రూటన్ వంటి రచయితలను పరిచయం చేశారు.

చివరిలో “గురూజీ రవీంద్ర శర్మ ” గారి “ఆదిలాబాద్ కళాశ్రమం” గురించి వారి ప్రసంగాల కృషి తెలుగులో కూడా లభించవలసిన అవసరం ఉందని తెలిపారు. ప్రసంగం ఆద్యంతమూ చక్కని ఉదాహరణలతోనూ తార్కికమైన ఆలోచనలతోనూ అందించారు శ్రీ హేలీ కళ్యాణ్ గారు. వారి కృషి అభినందనీయం, అనుసరణీయం.

ఈ ప్రసంగం పై శ్రీకస్తూరి మురళీకృష్ణ గారు వారి అభిప్రాయాన్ని తెలుపుతూ అనువాదం ఎంత ముఖ్యమో ఆ అనువాదం చేసేవారు ఎంత న్యాయం చేశారు అన్నది కూడా తగు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అని సూచించారు.

అభిప్రాయం:

“మనవాళ్లు వట్టి వెధవలోయి” అని తేలికగా తీసిపారేసే విధంగా సాహిత్యం మనలను రూపుదిద్దింది, అందులో సందేహం లేదు. ప్రస్తుత భారతీయ సనాతన ధార్మిక పరిస్థితి అందుకు సాక్ష్యం. అలా కాదు అని నిరూపించడానికి ప్రతీ భారతీయుడూ ,తెలుగువారమైన మనము చేతనైనంత కృషి ఏ రూపంలో అయినా నెరవేర్చవలిసిన ఆవశ్యకత ఉన్నది. యజ్ఞం , కర్మ , దానం, ధర్మం ,వంశ పరంపరాగత దేవతారాధన, సాహిత్య సేవ, పండుగలు, దేవాలయ పునరుద్ధరణ, ఇంకా ఎన్నో..

ఇన్ని పార్శ్వాలలో ఎంతో కొంత చేస్తున్న సామాన్యులూ, వ్యవస్థలూ, తారసపడుతూ ఉంటారు(యి). ఇంతమంది ఇన్ని చేస్తూ ఉన్నా ప్రయత్నంలో పరిపూర్ణత కోసమై , మన దేశ ధార్మిక వ్యవస్థ పై వెలువెత్తే ప్రశ్నలకు నా వంటి సామాన్యులు సిద్ధంగా ఉండాలి అని అంటే పుస్తకములే ఆధారం. కాబట్టి ఎంతో శ్రమకు ఓర్చి వ్రాసిన అటువంటి పుస్తకములు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన దేశ సాంస్కృతిక పరిస్థితికి వస్తున్న ప్రశ్నలకు తగు సమాధానంగా అలోచన చేసి తెలుగులో కూడా అందించవలసిన అవసరం ఉంది అని చెప్పడం ఈ ప్రసంగంలోని ఉద్దేశంగా తోచింది. అలాగే ముఖ్యమైన విషయం, మన దేశ సాంస్కృతిక సంబంధమైన, ధర్మ మీమాంసాలపైన కొన్ని పుస్తకాలు/వ్యాసాలు/ విషయాలు గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ రాజకీయ / సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చారిత్రక విషయాలను మరుగున పెట్టే ప్రయత్నం కూడా జరిగింది. ఉద్దేశ పూర్వకంగా మరుగున పెట్టలేదు అని అనుకున్నా, జాతీయతా భావాలున్న వారు కూడా విస్మరించిన విషయంగా కూడా కనపడుతుంది. పైన వివరించిన పరిస్థితికి ప్రసంగంలో ఉదాహరణగా తెలుగు వారికి వీరేశలింగం గారితో ఉన్నంత సామాన్య పరిచయం వారి సమకాలీనులు, సమఉజ్జీలు, అయిన కాశీభట్ట వారి పరిచయం లేకపోవటం గమనించవచ్చు. ఇటువంటి మహనీయులు ఎంతమందో!

కాబట్టి నిందలతో పని లేకుండా ధార్మిక సాంస్కృతిక విషయములలో మన అభిప్రాయాలు సరిచేసుకుంటూ ఉండాలి. తెలుగు సాహిత్య పోషకులు, ఔత్సాహికులు ప్రసంగంలోని “మౌనం – అన్వేషణ” ల పైన దృష్టి సారించవలసినదిగా దిశా నిర్దేశం చేసుకొని,తగు విధంగా భారతీయతను పరిపుష్టం చేసుకోవలసిన బాధ్యత భారతీయులుగా ,తెలుగువారిగా మనకి ఎంతో ఉంది. ఇటువంటి సాహిత్యానికి కూడా తెలుగు నుడి నెలవు కాగలదని భావిస్తూ మీరు కూడా ఈ ప్రసంగాన్ని వినాలని కోరుకుంటున్నాను.

0

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

ఫస్ట్ ఢిల్లీ ట్రిప్

1974 లో నాకు పెళ్ళి అయింది.మా నాన్న గారికి మేడపాడు స్టేషన్ కు

సరదా !!

1974-మార్చ్ నేను MA ఫైనల్ సంవత్సరం. అప్పటికి ఇంకా 21 నిండలేదు. క్లాసు